సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్ని అడ్డంకులు వచ్చిన తగ్గేదే లే.. అంటూ సీఎం జగన్ వచ్చే సెప్టెంబర్ నెల నుంచి విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. నేడు, బుధవారం శ్రీకాకుళం జిల్లా లో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.4,361 కోట్ల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం జరగనుంది. మూలపేట పోర్టు 100 బిలియన్ల సామర్థ్యానికి చేరుతుంది. మూలపేట పోర్టుతో 35 వేల మందికి ఉపాధి అవకాశం ఉంది. మూలపేట పోర్టుతో మరో 2 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామన్నారుఅలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్.. హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విశాఖలో సెప్టెంబర్ నుండి పాలన కొనసాగిస్తామన్నారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తామన్నారు.విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదల పక్షాన ఉన్నవారికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ‘‘మీ బిడ్డ జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మిగతా వారందరూ ఏకమవుతున్నారు. అందరూ ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నారు. పచ్చ మీడియా ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతూ నా పాలనపై విషం కక్కుతోంది. మిమ్మలిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా నేను ప్రజలను నమ్మకొన్నాను అన్నారు.
