సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పట్టణ పరిధిలోని అయి–భీమవరం గ్రామానికి వెళ్లే రోడ్డు మార్జిన్లో వున్న ఆక్రమణలు తొలగించారు. ఈ మార్గం వెంబడి ఉన్న పంట కాల్వలో రొయ్యల షెడ్డుల రొయ్యల వ్యర్థాలు వేయడంతో తీవ్ర దుర్గంధం తో పాటు కలుషితమైన తాగునీరు దుంపగడప ప్రజలు నిత్యం త్రాగే మంచినీటి చెరువుకు వెళుతున్నాయి. దీనితో దుంపగడప ప్రజలు అనారోగ్యాలు, విషజ్వరాల బారిన పడుతూఉన్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని కూడా మరణించింది. ఈ విషయం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆక్రమణదారులకు తాళ్ళకోడులో కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆక్రమణదారులు గడువు కావాలంటూ తొలగింపు ను అడ్డుకుంటూ సీపీఎం నేతలతో కలిసి గత మంగళవారం ఆందోళనకు దిగారు.స్థానిక సీపీఎం నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే చర్చలు అనంతరం గత బుధవారం సాయంత్రానికి జిల్లా పోలీస్ బారి పర్యవేక్షణలో ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తమ ఆక్రమణలు తొలగించి వెళ్లిపోయారు. ఎక్స్కవేటర్ల సాయంతో ఆక్రమణలు తొలగించారు. రెవెన్యూ, నగర పంచాయతీ, అగ్నిమాపకశాఖ, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు దీనిలో పాల్గొన్నారు.
