సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ సినీ హీరో మోహన్‌బాబుకు తనపై నమోదైన కేసులకు సంబంధించి విచారణకు తమ ముందు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హై బీపీ తో, స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు పోలీసుల నోటీసులపై తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్‌‌మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్‌ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి మోహన్ బాబు కు తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది. మోహన్‌బాబుపై మరో కేసు నమోదైందని పోలీసుల తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జర్నలిస్ట్‌పై దాడిచేసిన ఘటనపై మోహన్‌బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని కోర్టుకు తెలిపారు. మోహన్ బాబు గత 4 రోజులుగా అసలే కుటుంబ ఆందోళనతో సతమతమౌతున్న నేపథ్యంలో ప్రస్తుత అనారోగ్యం, పెద్ద వయస్సు ( 78 ఏళ్ళు) రీత్యా మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే పోలీస్ నోటీసులు అందుకున్న మంచు మనోజ్ ఇవాళ విచారణకు హాజరయ్యారని తెలిపారు. మరోవైపు మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి రెండు గంటలకు ఓసారి మోహన్‌బాబు ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *