సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తీసుకొన్న కఠిన నిర్ణయాలు అక్కడ ఉంటున్న భారతీయులకు శరాఘాతంలా తాకాయి. మరో ప్రక్క డాలరుతో పోలిస్తే మన రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. ఆఖరికి అక్కడ చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలలో చేరటం ఫై కూడా తీవ్ర ఆంక్షలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం .. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తిస్తున్న అధికారులు వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. అందులో భాగంగా భారత్కు ఓ విమానం బయలుదేరింది. సీ17 విమానంలో వీరిని తరలిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉంటున్న దాదాపు 5 వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా, అమెరికాలో భారత్కు చెందిన దాదాపు 7.25 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉంటున్నట్టు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్కు తరలించేందుకు జాబితా సిద్దమైయింది. ఈ విషయంలో భారత్ కూడా తమ స్పందనను తెలియజేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఎక్కడ ఉన్నా భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపింది. కాగా, మెక్సికో, సాల్వెడార్ తర్వాత అమెరికాలో అనధికారికంగా ఎక్కువగా ఉంటున్నది భారతీయులే అంటూ వార్తలు వస్తున్నాయి.
