సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో రేపటి మంగళవారం రోజు.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల సభ్యులు మొత్తం 781 మంది (లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది) ఓటర్లుగా ఉన్నారు. పాలక ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67), విపక్ష ‘ఇండీయా’ కూటమి నుంచి, తెలుగువారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి (79) పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీల ఎంపీలూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధలో ఎఫ్-101 గదిలో రేపు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. తాజా లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమికి కి 425 మంది, ఇండీ కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. ఇతర ప్రతిపక్షాల్లో జగన్ సారధ్యంలోని వైసీపీ తన 11 మంది ఎంపీల మద్దతును ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.
