సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో భారతదేశ ఉక్కు రంగం వృద్ధి చెందుతోందని, 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు శుక్రవారం ఢిల్లీలో అన్నారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో స్వీడన్ దేశ ఇంధనం, వ్యాపారం మరియు పరిశ్రమలశాఖ సహాయమంత్రి సారా మోడిగ్ తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తక్కువ-కార్బన్ ఉక్కు సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన భారతదేశం-స్వీడన్ ‘LeadIT’ కార్యక్రమాన్ని శ్రీనివాస వర్మ ప్రశంసించారు. ఈ కీలక సమావేశంలో స్వీడన్ యొక్క మెటలర్జికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SWERIM) మరియు స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా (SRTMI) మధ్య పరిశోధన సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. విదేశాల నుండి ఉక్కు దిగుమతులపై ఆధారపడతాన్ని తగ్గించి స్థానిక పరిశ్రమలలో ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈ సమావేశంలో భారతదేశంలో స్వీడన్ రాయబారి జాన్ థెస్లెఫ్, స్పీడిష్ ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.
