సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ 13వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కామాఖ్య – చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. నేడు, ఆదివారం తణుకు రైల్వే స్టేషన్లో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, స్థానిక ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణతో కలిసి ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా రైలులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ భీమవరం టౌన్ స్టేషన్కు చేరుకున్నారు. భీమవరం టౌన్ స్టేషన్లో ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద రావు, NDA కూటమి నేతలు, కార్యకర్తలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శ్రీనివాస వర్మకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమృత్ భారత్ రైలు ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. నరసాపురం పార్లమెంటు పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వందే భారత్, అరుణాచలంకు ప్రత్యేక రైలు, అమృత్ భారత్ వంటి ఆధునిక రైల్వే సర్వీసులు తీసుకువచ్చిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కృషిని అభినందించారు.
