సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో పాటు పంచా రామం, జేపీ రోడ్డులోని శ్రీ దత్త మందిరం లోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం( ఫై తాజా చిత్రం అక్కడిదే),గునుపూడి శ్రీ ఆదిలక్ష్మి పోలేరమ్మ ఆలయం, దిరుసుమర్రు రోడ్డులోని శ్రీ దుర్గలక్ష్మి ఆలయంతో పాటు అన్ని దేవి, విష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 10 తరువాత చిరు జల్లులు పడ్డాయి. అప్పటి వరకు వాతావరణం మేఘావృతం అయ్యి చల్లగా ఉండటంతో భక్తుల ఆహ్లదం మరింత ఉత్తేజితమైంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ప్రసాద వితరణలు చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణమాసం అంటే శ్రీమహావిష్ణువు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రావణమాసంలో చేసే నోములు, వ్రతాలు, పూజల వల్ల లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు
