సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. రేపు, బుధవారం విజయదశమినాడు.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును కూడా భారత రాష్ట్ర సమితి గా మార్చుతూ తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో తీర్మానిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైనా.. దసరా రోజున సర్వసభ్య సమావేశం యథావిథిగా ఉంటుందని కేసీఆర్ తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. మర్నాడు దానిని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం దీనిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలుస్తోంది. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్టనుంది. ఆయన ఇప్పటికే ఏపీలో కూడా కెసిఆర్ చరిష్మా చూపించడానికి బలమైన టీడీపీ నేతలను ఆహ్వానిస్తున్నారని సమాచారం. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా ఇప్పటికే మాట్లాడారని అంటున్నారు. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తారని భావిస్తున్నారు.ఆంధ్రలోనూ తమ పార్టీ శాఖ ఉంటుందని, క్రమంగా దానిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. తమ బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో రాజకీయ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.
