సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ జాతీయ ఛానల్కు నేడు, బుధవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముమ్మాటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను వెనక్కి తెచ్చుకోవడం సహా భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల స్పష్టంచేసిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో గతంలోనూ రాజ్నాథ్ సింగ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 27న శ్రీనగర్లో జరిగిన ఇన్ఫ్రాంట్రీ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనికి పాక్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాలను వెనక్కి తెచ్చుకోవాలంటూ 1994లో పార్లమెంటు ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
