సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లో వరుసగా 2 సార్లు సీఎం పదవితో పాటు తాజగా ప్రతిష్టాకరమైన ఢిల్లీ మేయర్ పదవి కూడా గెలుపొంది ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. వివరాలలోకి వెళ్ళితే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు, బుధవారం ఎంసీడీ మధ్యాహ్నం 11.30 గంటలకు ఎంసీడీ సమావేశమై ఎన్నికల పోలింగ్ ను నిర్వహించగా ఎంసీడీ మేయర్ (MCD mayor)గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, షెల్లీ ఒబెరాయ్కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరగాల్సిఉండగా, సభా కార్యక్రమాలకు మూడు సార్లు అవాంతరాలు తో వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు కీలకమైన మేయర్ పదవికి మాత్రం ఓటింగ్ జరిగింది. ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లు గెలుచుకుని, మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకుంది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. . ఈ విజయం తో ఆమ్ ఆద్మీ పార్టీ దేశరాజధాని ఢిల్లీ లో మరింత పట్టు సాధించిందనే చెప్పాలి.
