సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాసనసభలో ఆ ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు నేడు, శుక్రవారం కనిపించలేదు. టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం, వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కాగా సమావేశాలకు చివరిరోజయిన శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బెంగళూరుకు వెళ్లినట్టు భావిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివరణ ఇచ్చుకున్నారు. ‘నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు. వైసిపి అభ్యర్థికే ఓటువేసాను. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశాను. ఉదయమే నా కుమార్తెతో పాటు సీఎం జగన్ గారిని కలిశాను. సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారు. జగన్ గారి నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది. క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయి. మాకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాం. దళిత మహిళపై దుష్ప్రచారం చేయొద్దు. నేను అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉంటే నియోజకవర్గానికి ఇంచార్జ్ని పెట్టినప్పుడే రాజీనామా చేయాలి. ఆ 22 మందిని స్క్రూటిని చేసి నిజాన్ని తేల్చండి. మళ్లీ చెబుతున్నాను.. నాకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో నా పేరును దయచేసి లాగొద్దు’ అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.
