సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణా జిల్లాలో చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో మున్నెటి వాగులో గత సాయంత్రం 5గురు చిన్నారుల గల్లంతు నేటి మంగళవారం ఉదయానికి విషాదంగా ముగిసింది.వీరంతా 11, 12 ఏళ్ల వయసు చిన్నారులు… స్థానిక జడ్పీ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడంతో మధ్యాహ్నం భోజనం తరువాత మునేటిలో ఈతకు వెళ్లారు. పొలం పనులకు వెళ్లి తిరిగివచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం మొదలెట్టారు. మున్నేటివాగు వద్ద పిల్లల దుస్తులు చూసి కుప్పకూలిపోయారు. తమ పిల్లలు నీటిలో గల్లంతయ్యారా? లేక అని తీవ్ర ఆందోళన చెందారు. వారి అనుమానం నిజమైంది. నాగులూరి సుబ్బారావు, మేరీల చిన్న, నాగులూరి సన్ని, కర్ల బాల ఏసు, గురజాల చరణ్ గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సుశీలాదేవి, సీఐ నాగేంద్ర కుమార్, ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలసి వెళ్లి స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. తిరిగి నేటి ఉదయం గాలింపు చర్యలు చేపట్టి ఐదు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.
