సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గత 2 ఏళ్లుగా దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్వేవ్తో పోలిస్తే ప్రస్తుత థర్డ్ వేవ్ వల్ల మరణాలు, ఆస్పత్రిపాలవడం తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత వేవ్లో కేసులు పెరుగుతున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడందుకోవడంతో కరోనా సోకిన ప్రజలు తీవ్ర స్థాయిలో అనారోగ్యాలపాలవడం, చావులు పెరగడం కనిపించడంలేదని తెలిపింది. ఈ మేరకు రెండు, మూడు వేవ్స్ను పోల్చిచెప్పే కీలక సూచీలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు..దేశంలో 2021 ఏప్రిల్ చివరకు 3.86 లక్షల కొత్త కేసులు, 3,059 మరణాలు ఉంటె 2022 జనవరి 20న దేశంలో 3.17 లక్షల కొత్త కేసులు, 380 మరణాలు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల థర్డ్ వేవ్లో మరణాలు తగ్గాయన్నారు. వ్యాక్సినేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ సమర్ధవంతంగా ఉందన్నారు. 18ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం మంది రెండు డోసులు, 94 శాతం మంది తొలిడోసు అందుకున్నారని చెప్పారు. 15– 18 ఏళ్ల కేటగిరీ ప్రజల్లో 52 శాతం మంది తొలిడోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ కేటగిరీలో టీకాలందుకున్నవారిలో ఆంధ్ర ప్రదేశ్ టాప్లో ఉందని ప్రశంసించారు. ప్రజలందరూ మాస్కులు ధరించి అప్రమత్తంగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు.
