సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: త్రిదండి శ్రీరామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో హైదరాబాద్ లోని శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల మహా విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తోంది. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. నిత్యం 500 మంది కూలీలు శరవేగంగా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని పిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. ఆ రోజు రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. అక్కడ మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు.ఈ కార్యక్రమాలకు ముఖ్య ఆహ్వానితులుగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసిఆర్, జగన్ కు ఇప్పటికే శ్రీరామానుజ చినజీయర్ స్వామి స్వయంగా ఆహ్వాన లేఖలు అందజేశారు.
