సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా తిరుమలలో నాలుగురోజుల పాటు పలు సేవలను రద్దు చేశారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాల నిర్వహించనున్నారు.. దీంతో భక్తులకు శ్రీవారి దేవాలయంలో ఈ నెల 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. మార్చి 20న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణి లో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారని రెండోరోజు మార్చి 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై , 22న శ్రీభూ సమేతంగా మలయప్ప స్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. 23న శ్రీమలయప్పస్వామివారు ఐదుసార్లు, 24న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారని ప్రకటించారు.
