సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పై మరోసారి కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే కూటమి లోని పార్టీల నేతలకు 80 శాతం మేర అభ్యర్థుల పోస్టుల భర్తీ పై కసరత్తు, వడపోత పూర్తయింది. మిగిలిన కసరత్తును కూడా పూర్తి చేసి ఈ సెప్టెంబర్ నెల ఆఖరు లోగా నామినేటెడ్ పదవుల పందేరం ప్రారంభించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్టు బోర్డు పాలకవర్గాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. కూటమికి రాష్ట్రంలో 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఓ యూనిట్గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల 60 శాతం పదవులు పసుపు సోదరులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన 40 శాతంలో జనసేన నేతలకు 30 శాతం,బీజేపీకి 10 శాతం పదవులు ఇస్తారని చెబుతున్నారు.ఇక అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 నియోజకవర్గాల్లో 60 శాతం జనసేన, 30 శాతం టీడీపీ, 10 శాతం బీజేపీ నేతలకు పదవులివ్వాలని నిర్ణయించారని సమాచారం. ( భీమవరం లో జనసేన నేతలకు భారీ నామినేటెడ్ పదవులు ఖాయం) ఇదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50 శాతం,మిగిలిన 50 శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరిసగం తీసుకొనే అవకాశం ఉంది.
