సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా ‘పుస్తక ప్రసాదం’ అందించే కార్యాచరణ లో టీటీడీ ఉంది. టీటీడీ ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను హిందూ ధార్మిక ప్రచార పరిషత్(హెచ్డీపీపీ) ఆధ్వర్యంలో భక్తులకు పంపిణీ చేసేలా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు దాతల సహకారం తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీనివాసుని దివ్యకథ, భజగోవిందం, లలితా సహస్రనామ స్తోత్రం, రథ సప్తమి, కళ్యాణ తేజో దీపిక’ వంటి వివిధ రకాల పుస్తకాలు భక్తులకు అందించనున్నారు. అతి త్వరలో తిరుమలకు వచ్చే భక్తులకు మాత్రమే పుస్తక ప్రసాదం అందిస్తారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు.
