సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారు లోని పెద అమిరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో మూడురోజులపాటు నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్ ఇండియా ఎగ్జిబిషన్ను నేడు, గురువారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ సందర్శించారు. దేశంలోని 20 రాష్ట్రాల నుండి ఏర్పాటుచేసిన 85 స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. మన ప్రాంత ఆక్వా పరిశ్రమకు చెందిన వ్యాపారులు, ఎగుమతిదారులు, రైతులు మరియు సీడ్ ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరేలా ఒకే వేదికపై ఆధునిక సాంకేతికత, నూతన ఉత్పత్తులను ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు.రైతులు ఇలాంటి ప్రదర్శనలను ఉపయోగించుకోవాలి అన్నారు. ఇటీవల అమెరికా విధించిన టారీఫ్ వల్ల పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటు న్నప్పటికీ, దేశ ప్రయోజనాలే ముఖ్యమని అందరూ సహకరిస్తున్నారని ఆయన అన్నారు, కేంద్ర ప్రభుత్వం రైతులపై అమెరికా టారీఫ్ ప్రభావం పడకుండా, కొత్తగా 20 దేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి రైతులకు భరోసా కల్పించింది అని శ్రీనివాస వర్మ అన్నారు. దేశంలో తొలిసారిగా ఆక్వా పరిశ్రమకు ఒక ప్రత్యేక శాఖ మంత్రిని ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రైతులు, ఎగుమతిదారులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు.
