సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సిపిఐ పార్టీ 100 ఏళ్ళశతాబ్ధి ఉత్సవాలు పురస్కరించుకొని నేడు, శుక్రవారం పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాల నడుమ భీమవరంలో సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్నిపశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు భీమారావు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఇండోర్ సబ్ స్టేషన్, ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్, సబ్ జైల్, తహశీల్దార్ కార్యాలయం, వెంకట్రామ ధియోటర్ మీదుగా ప్రకాశం చౌక్ వరకు పార్టీ శ్రేణుల అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ.. వందేళ్లుగా కష్టజీవుల వెన్నంటే ఎర్రజెండా ఉందని, ప్రజల కోసం చేసిన పోరాటాలు, త్యాగాలు, సాధించిన విజయాలను భావి తరాలకు చేరేలా కృషి చేయాలని, సిపిఐ వందేళ్ల ఉత్సవాలు ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో లక్షలాదిమందితో జరిగే ప్రజాప్రదర్శన, బహిరంగ సభలను జయప్రదం చేయాలన్నారు. బ్రిటీష్ ధాస్యశృంఖాలకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర సముపార్జనకు సీపీఐ చేసిన పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించబడిందని, పార్టీ వందేళ్ల చరిత్రలో పేదల పక్షాన నిలబడి ఎన్నో త్యాగపూరిత పోరాటాలు నిర్వహించిందన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్ తదితరులు మాట్లాడారు.
