సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల లోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, వివిధ ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను విడుదల చేసేందుకు తేదీలను నేడు, బుధవారం టీటీడీ ఖరారు చేసింది. అధికారిక వెబ్ సైట్ http://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఈ టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు అధికారులు స్పష్టం చేశారు.ఈ రోజు.. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో టికెట్లు విడుదల చేసారు. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లు.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల కానున్నాయి. మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా.. అలాగే అదే రోజు ఉదయం 11.00 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మార్చి 24వ తేదీ ఉదయం 10.00 గంటలకు టీటీడీ ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుమలలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది.
