సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: టిడిపి భీమవరం నియోజక వర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి నేడు, మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకు వెళ్లి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాత్రం ఆక్వా రైతుల గోడును పూర్తిగా విస్మరించారని విమర్శించారు. మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోయి, పెట్టుబడులు భారీగా పెరిగి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నా తన ఐదేళ్ల తుగ్లక్ పాలనలో వారికి ఎటువంటి ఆర్థిక సాయం అందించలేదన్నారు. కోవిడ్ సంక్షేమ సమయంలో ఎగుమతులు దెబ్బతిని ఆక్వా రైతులు అల్లాడిపోతున్నా నాటి వైకాపా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్కెట్లు చూపించలేదని, పైగా ఆక్వా రైతులను తికమక పెట్టే మూడు జీవోలను తీసుకు వచ్చి 70 శాతం మేర రైతులకు మొండి చెయ్యి చూపించారని, రొయ్యల ఫీడ్, సీడ్ ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని,మరి జగన్ కు నేడు ఆక్వా రైతులపై ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చిందో ఆక్వా రైతుల కోసం భీమవరం పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఎలాంటి జోన్ల నిబంధనలు లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ను రూపాయి 50 పైసలకే అందించే ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
