సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ జిల్లా, రావులపాలెం లో పొట్టకూటి కోసం ఇతర జిల్లాల నుంచి పని కోసం వలస వచ్చి ఇద్దరు కూలీలు విద్యుత్ షాక్తో మృతి చెందారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం… పార్వతీపురం జిల్లా పాలకొండకు చెందిన గుడబా ఆర్లప్ప (48), అతని మేనల్లుడు గుడ్డు వెంకటరమణ (35) కుటుంబ సభ్యులతో కలిసి రావులపాలెం వచ్చారు. సీఆర్సీ రోడ్డులోని వసంతవిహార్ అపార్టుమెంట్లో కొంతకాలంగా పనులు చేస్తున్నారు. అపార్టుమెంటులో కటింగ్ మిషన్తో ఆర్లప్ప పనిచేస్తుండగా వైర్ షార్ట్ సర్క్యూట్ అయి షాక్కు గురయ్యాడు. అదే సమయంలో వెంకటరమణ స్విచ్చాఫ్ చేయకుండా వెళ్లి ఆర్లప్పను పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వలస వచ్చిన ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరుతో ఆ ప్రాంతం విషాదం అలముకొంది.
