సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయడంతో పాటు, తాజాగా మరికొన్ని మెయిన్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదన లు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ …భీమవరం నుండి దొంగపిండి, గూట్ల పాడు రేవు నుండి బర్రివాని పేట వరకు రోడ్డు నిర్మాణ నిమిత్తం రూ 35 కోట్లు, భీమవరం నుండి ఎల్ వి ఎన్ పురం రోడ్డు వయా కొమరాడ అనకోడేరు రోడ్డు నిర్మాణ నిమిత్తం రూ 25 కోట్లు, భీమవరం నుండి పిప్పర వరకు రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల 80 లక్షలు, చిన అమిరం నుండి గొల్లవాని తిప్ప రోడ్డు నిర్మాణానికి రూ మూడు కోట్లు, మొగల్తూరు -బేతపూడి రోడ్డుకు రూ రెండు కోట్లు, శృంగ వృక్షం నుండి యమునా పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల 20 లక్షల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు. అంతే కాకుండా సంబంధిత ఆర్ అండ్ బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తో ఫోన్లో మాట్లాడడం జరిగిందని అన్నారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వెళ్లే ప్రధాన రహదారి రోడ్ల నిర్మాణాలను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు .జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు రహదారుల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు రోడ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ ఈ లోకేశ్వరరావు, డీఈలు రామరాజు, కిరణ్ కుమార్, జేఈ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
