సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదు అవుతూ.. గత మూడు రోజులుగా కురుస్తున్న కుంభ వృష్టి నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులు, తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు, శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, డి ఈ రాజారావులతో పట్నంలో వర్షాల పరిస్థితి పై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ … పట్టణంలో వర్షం నీరు ఎక్కడైనా నిలిచి ఉంటే వెంటనే ఆ నీటిని బయట కు తోడేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పట్నంలోని బుధవారం మార్కెట్ వద్ద అత్యవసరంగా పైపు కల్వర్టును వెంటనే నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్లపు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అధికార యంత్రాంగం వార్డుల్లో పర్యటించాలన్నారు. గ్రామాలలో ప్రజలు వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా అనేదానిపై గ్రామ సర్పంచులు, కార్యదర్శులు పరిశీలించాలని అన్నారు. దోమలు సమస్య పెరిగిపోయి ప్రజలు అనారోగ్య పరిస్థితుల బారిన పడే ప్రమాదం ఉంటుందని, నీటి గుంతలలో డ్రైన్స్ కిమిసంహార మందులు చల్లాలని, ఎప్పటికప్పుడు అలర్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
