సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని గుంటూరు జిల్లాలో సమాజం సిగ్గు పడే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను నడిరోడ్డుపై వివస్త్రం చేసి స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు అవమానించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటన స్థానికులను నివ్వెర పరచింది.. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, హోమంత్రి అనిత స్పందించారు. మహిళలపై ఇలాంటి దారుణాలు సహించేది లేదని నిందితులపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.ఈనెల 15వ తేదీన రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటుంది. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా వెంకటరమణమూర్తి సోదరి, ట్రాన్స్ జెండర్ మాధవి ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలి పెట్టాలని బాధితురాలు వేడుకున్నా కనికరించలేదు. బాధితురాలు ఈనెల 16న ఫిర్యాదు చేయడంతో వెంకటరమణమూర్తితోపాటు అతని సోదరితో కలిపి మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
