సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేడు, మంగళవారం రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో బోటుపై ప్రయాణించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న లంక గ్రామాలలోని ఆయా ప్రాంతాలను పరిశీలించారు. కాలుష్యం వల్ల స్థానికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు.అధికారులతో గోదావరిలో కలుస్తున్న పేపర్ మిల్ కాలుష్య వ్యర్ధాల శాంపిల్స్ తీయించారు. పవన్ ఆకస్మిక తనిఖీతో ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు.ఈ సందర్భముగా పవన్ మాట్లాడుతూ… పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం కాదు రోగాలు వస్తాయని ఇటీవల ఏలూరులో తాగునీటి కాలుష్యం కారణంగా సంభవించిన మరణాలు మర్చిపోయారా అని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి మాత్రమే కాదు.. పర్యావరణం కూడా ముఖ్యమని రాష్ట్ర అసెంబ్లీ, క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంపై చర్చిస్తామన్నారు.
