సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా,దీపావళి పండగల సీజన్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా సొంతూళ్లకు వెళ్లే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి నుండి -శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.అయితే ఈ ప్రత్యేక రైళ్ల బయలుదేరే సమయం, ఆయా స్టేషన్లలో రాకపోకల సమయాలను దక్షిణ మధ్య రైల్వే ఇంకా వెల్లడించలేదు ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.ప్రతి మంగళవారం, బుధవారం ఈ సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. 07037 నంబర్ ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్కు నడుస్తుంది. అక్టోబర్ 6, 13, 20, 27వ తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో ఈ రైలు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అనంతరం మరుసటి రోజు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్కు చేరుకుంటుంది.అదేవిధంగా 07038 నంబర్ ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లికి తిరుగు ప్రయాణం చేస్తుంది. అక్టోబర్ 7, 14, 21, 28వ తేదీల్లో.. అలాగే నవంబర్ 4, 11, 18, 25వ తేదీల్లో ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు చర్లపల్లికి చేరుకుంటుంది.ఈ ప్రత్యేక రైళ్లు పలు ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో రాకపోకలు సాగిస్తాయి.
