సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో మొదటి విడతగా జరుగుతున్న గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నేడు, గురువారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ డిఇ బి వెంకటరమణతో ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న గృహ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. CM జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం లో సుమారుగా 14 వేల మందికి పైగానే ఇళ్ల స్థలాలను మంజూరు చేసి, పట్టాలను కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఒక్కో గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ లక్ష 80 వేల నిధులను ఉచితంగా మంజూరు చేయడంతో పాటుగా లబ్ధిదారుల ఇష్టం మేరకు 30 వేల వరకు బ్యాంకు రుణాలను కూడా అందించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 6 వేల 324 గృహ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జగనన్న కాలనీలుగా రూపుదిద్దుకుంటున్న ఈ కాలనీలకు ప్రభుత్వం అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు. జగనన్న కాలనీలకు త్రాగునీటి సౌకర్యాన్ని, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణాలపై రోజువారి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.
