సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఏడాది మార్చిలోగా దేశవ్యాప్తంగా మూడు రకాల(వందే చైర్ కార్, వందే మెట్రో, వందే స్లీపర్) వందేభారత్ రైళ్లను నడుపుతామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ డెహ్రాడూమ్ లో మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న శతాబ్ది, రాజధాని, లోకల్ రైళ్ల స్థానంలో వీటిని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయని చెప్పారు. దెహ్రాదూన్లో ఢిల్లీ-దెహ్రాదూన్ వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. వంద కిలోమీటర్లలోపు వందే మెట్రో, 100-550 కిలోమీటర్ల మధ్య వందే చైర్ కార్, 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణానికి వందే స్లీపర్ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ మధ్యకల్లా ప్రతి రాష్ట్రానికి ఓ వందేభారత్ రైలును అందిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీలో ప్రతి ఎనిమిది, తొమ్మిది రోజుల్లోగా ఓ కొత్త ట్రైన్ తయారవుతోందని, మరో రెండు ఫ్యాక్టరీల్లోనూ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నామని, కానీ ట్రాక్ సామర్థ్యం మేరకు వాటిని 130 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నామని కేంద్ర మంత్రి అశ్వని తెలిపారు.
