సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారాలోకేష్ జిల్లాలో రోడ్డులు అద్వానంగా ఉన్నాయని వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. నల్లజర్ల మండలం చీపురుగూడెం వద్ద నీరు నిల్వ ఉన్న గోతుల రోడ్డులో వరినాట్లు వేసి తన నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… జగన్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయన్నారు. గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ముఖం చూసి రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని ఆరోపించారు. . గత టీడీపీ ప్రభుత్వంలో ఇదివరకెన్నడూ లేని విధంగా 25 వేల కి.మీ.ల సిమెంటు రోడ్లు వేశామన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఖాళీ అయిపోవడంతో రోడ్ల నిర్మాణాల కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చిన నిధులను కూడా జగన్ మిగతా పథకాలకు దారి మళ్లించారని లోకేశ్ ఆరోపించారు.
