సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3రోజులుగా ..తుఫాన్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా లో తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ నేడు, బుధవారం వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. నేటి ఉదయం భీమవరం పరిసర ప్రాంతాలలో కాస్త చిరుజల్లులు పడినప్పటికీ మధ్యాహనానికి భానుడు నిప్పులు కక్కుతూ రైతులను ప్రజలను కరుణించాడు. ఇదే తరహా ఎండ మరో 2 రోజులు కొనసాగితే నష్టాలకు కొంత ఉపశమనం లభించినట్లే.. ఇక గత మంగళవారం కురిసిన కుండ పోత వర్షం నేపథ్యంలో జిల్లాలో ఆకివీడులో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ ఒక్క రోజులో 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భీమవరం పరిసర ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.భీమవరంలో 21.7, కాళ్ళలో 25.5, ఉండిలో 20.9, మొగల్తూరులో 22.7, గణపవరంలో 22, పాలకోడేరులో 19.1, మొత్తం మీద జిల్లాలో సగటు వర్షపాతం 16.7 సెంటీమీటర్లు నమోదైంది. మరోవైపు, వీరవాసరం, లో సుడి గాలులు భయా నక వాతావరణం సృష్టించాయి. పొలాలలో పంటలు చెల్లాచెదురు కాగా , చెట్లు, కరెంట్ స్తంబాలు విరిగి పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గత రాత్రి వర్షంలో వెళ్లి వీరవాసరం నష్టపోయిన బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
