సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గం రాయనపాడులో నేడు, శనివారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దగ్గుబాటి పురందేశ్వరి, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే నినాదంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. వివిధ పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు. నవంబర్ 15 నుంచి మోదీ గ్యారంటీ రథం పేరుతో హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. బ్యాంకులకు వెళ్లాలంటేనే పేదలు భయపడేవారు. ఇప్పుడు బ్యాంకర్లే పేదల దగ్గరకి వచ్చి జీరో అకౌంట్లు ఓపెన్ చేయించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు. జన్ ధన్ అకౌంట్ల ద్వారా దేశంలో అందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. 17 రకాల పథకాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం మోదీ అమలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్యం. కోవిడ్ నుంచి ఉచిత బియ్యం ఇస్తున్నారు. రైతుల కోసం పీఎం కిసాన్ ద్వారా ఆరు వేలు ఇస్తున్నారు. ఫర్టిలైజర్ బస్తా రెండు వేలు విలువ చేసేది రూ.266కే రైతులకు అందిస్తున్నారు. పీఎం విశ్వకర్మ పేరుతో చేతి వృత్తుల వారిని మోదీ ప్రోత్సహించారు.’’ అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
