సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా.. ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా పయనిస్తుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఇది క్రమంగా బలపడి తుపానుగా ఈనెల 26వ తేదీ రాత్రికి మయమ్మర్ (బర్మా) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ప్రకటించింది. ఐతే ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఉండదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. కాగా ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా చెదురు మదురుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో మిగతా జిల్లాలలో ఎండల తీవ్రత కొనసాగుతోందని, రెండు రోజుల తర్వాత వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారిణి సునంద ప్రకటించారు.
