సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం వైఎస్సార్సీపీపై జనసేన కీలక నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అప్పుడే వైసీపీ వాళ్లు మొరగడం ప్రారంభించారని మండిపడ్డారు. ‘‘మేము కనీసం ఆరు నెలలు అయినా ఆగి చూశాం. వైసీపీ వాళ్లు నెల రోజులకే కాట్ల కుక్క లాగా వెంట పడుతున్నారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతాం. మీరు చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుంది. జగన్ తన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదు. ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని. గత ఐదేళ్లల్లో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయటపెడతాం’’ అని విమర్శించారు.‘‘రైతులు ఆత్మహత్య చేసుకుంటే జరగలేదని చెప్పాడు. కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణంగా జగన్ ప్రచారం చేశాడు. నేడు ఏపీలో రాష్ట్రపతి పాలన అని అడగటానికి జగన్కు సిగ్గుండాలి. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణ యుగం నడుస్తుంది. కేంద్రం సహకారంతో ప్రజా పాలన అందరూ చూస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను నాగబాబు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ను అందజేశారు.
