సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిత్తూరు జిల్లాలో నేడు, శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపునకు వెళ్తుండగా మొగిలి ఘాట్ వద్ద అదుపుతప్పింది. దీంతో ఐరన్ లోడ్తో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు మరో అటుగా వస్తున్న టెంపోపైకి దూసుకెళ్లటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే స్పాట్లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. లారీలో ఇనుప చువ్వలు ఉండటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
