సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ నేడు, మంగళవారం కీలక అప్డేట్ ఇచ్చింది. గేట్ పరీక్షలను వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 4 రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఫలితాలు మార్చి 19వ తేదీన విడుదల చేస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 2వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ఎమ్టెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గేట్ ప్రవేశపరీక్షకు ప్రతీ యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు సాధారణంగా ఈ పరీక్షకు హాజరవుతుంటారు.
