సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రోజ్గార్ మేళ ప్రధాన లక్ష్యమని, అందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. గుంతకల్లు డివిజన్లో నేడు శనివారం నిర్వహించిన 16వ రోజ్గార్ మేళా కార్యక్రమానికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 16వ రోజ్ గార్ మేళా ద్వారా 51,000 మందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం గుంతకల్లులో రైల్వే, పోస్టల్ శాఖల్లో ఎంపికైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా అందజేసి ఎంపికైన వారిని అభినందించారు. గత కొంతకాలంగా రోజ్గార్ మేళాల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలకుపైగా ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, ADRM సుధాకర్, పోస్టల్ శాఖ అదనపు డైరెక్టర్ వెంకట్ రెడ్డి,యువత, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
