సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత మంగళవారం ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సూచీలు నష్టాలు తో ముగియగా నేడు, బుధవారం మాత్రం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. జపాన్తో ట్రేడ్ డీల్ ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. గత మంగళవారం ముగింపు (82, 186)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు మూడు వందల పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 82, 343 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 44 పాయింట్ల లాభంతో 25, 105 వద్ద కొనసాగుతోంది. ఇటీవల ప్రకటించిన లాభాల కారణంగా ఎటర్నల్ షేర్లు మంగళవారం ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.సెన్సెక్స్లో డిక్సన్ టెక్నాలజీస్, ఐఆర్ఎఫ్సీ, టాటా మోటార్స్, ఎల్టీ ఫైనాన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 176 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 30 పాయింట్ల స్వల్ప లాభంతో కొనసాగుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.39గా ఉంది.
