సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బ్యాంకులు తమ రుణాల వసూళ్లకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రుణాలు తీసుకున్నవారికి బ్యాంకులు నియమించుకొనే సిబ్బంది లేదా రికవరీ ఏజెంట్స్ వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచీ ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. లోన్ రికవరీ బాధ్యతను ఇతర సంస్థలకు ఔట్సోర్సింగ్ చేసిన సందర్భాల్లో రికవరీ ఏజెంట్ల బాధ్యత ఆయా బ్యాంకులదే లేదా రుణదాతలదేనని స్పష్టం చేసింది. లోన్ రికవరీ కోసం ఉదయం 8 నుంచి రాత్రి 7 లోపు మాత్రమే రుణగ్రహీతలకు ఏజెంట్స్, బ్యాంకులు ఫోన్ చేయాలి. రుణగ్రహీతల అనుమతి తీసుకున్నాకే నిర్ణీత వేళలను దాటి కాల్ చేయాలి. మెడికల్ ఎమర్జెన్సీలు, వ్యక్తిగతంగా సున్నితమైన సందర్భాల్లో రుణగ్రహీతలను సంప్రదించకూడదు. రుణగ్రహీతలను బెదిరించడం, దుర్భాషలాడటం చేయకూడదు. బహిరంగంగా పరువు తీసే చర్యలకు దిగకూడదు.లోన్ రికవరీ కోసం యూజర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను దుర్వినియోగపరచకూడదు. యూజర్ల పరువు తీసేలా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగులను ఆన్లైన్లో షేర్ చేయకూడదు. లోన్ రికవరీ కోసం తొలిసారి రుణగ్రహీత ఇంటికి వెళ్లేందుకు కనీసం ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలి. రికవరీ ఏజెంట్ వివరాలను బ్యాంకులు ముందుగానే రుణగ్రహీతకు అందించాలి. రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. దీంతో పాటు లోన్ రికవరీకి అనుమతించే ఆథోరైజేషన్ లెటర్, ఇతర నోటీసులు వెంట తీసుకెళ్లాలి. ఈ లేఖలో బ్యాంకు గ్రీవెన్స్ అధికారి కాంటాక్ట్ నంబర్ కూడా ఉండాలి. ఇక ఈఎంఐ చెల్లింపులు లేదా లోన్ సెటిల్మెంట్ జరిగిన గంట లోపే డివైజ్ను యాక్టివేట్ చేయాలి.
