సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి చేతివృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో భీమవరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం ప్రాంగణంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లుల శ్రీనివాసరావు అద్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..పాలకుల నిర్లక్ష్యంతో, కార్పోరేట్ మాయాజాలంతో కనుమరుగవుతున్న సాంప్రదాయ చేతి వృత్తులను బతికించుకోవాలని సాంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి సబ్సిడీపై ముడిసరుకు, విద్యుత్ రాయితీలు, మార్కెటింగ్, విద్యా వైద్యం ఆరోగ్యం, సామాజిక పింఛన్లు అందించినప్పుడే వారు సాధికారత సాధిస్తారని ఆయన గుర్తు చేశారు.జిల్లాల వారీగా చేతివృత్తిదారుల సంఘాలతో సదస్సులు నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా రాష్ట్రలో సమాఖ్య మరిన్ని సంఘటిత పోరాటాలకు సమాయత్తం అవుదామని ఆయన పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. కుల వృత్తులను కార్పోరేట్ బాబులు కులవృత్తులుగా మార్చేసి వారికి ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎం.సీతారాంప్రసాద్, ఎ.పి.మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, జేగురు శ్రీనివాస్, వీరవల్లి శ్రీను, జుత్తుగ మీరయ్య, గూడూరి సత్యనారాయణ, చెల్లబోయిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
