సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో ఒక ప్రముఖ క్లబ్ లో గత శనివారం అర్థరాత్రి బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది మంటల్లో సజీవదహనం కాగా మరికొంతమంది పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్చ్ నైట్ క్లబ్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నైట్ క్లబ్లో ఓ లేడీ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తూ ఉండగా ఆమె వెనకాల కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. యువత ఆ ఆట, పాటకు మైమరచిపోయి కేకలు వేస్తూ ఉన్నారు. ఇంతలో వారి వెనకాల పైకప్పు నుంచి మంటలు మొదలయ్యాయి. ఇక హాహాకారాలతో పరుగులు.. సెకన్లలో ఆ ప్రాంతం మొత్తం మంటలు పొగతో నిండిపోయింది.
