సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ సురక్షితమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ. అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ ఆకాంక్షించారు. అయితే వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేస్తూ, వాహనాలకు సైలెన్సర్ లేకుండా శబ్దాలు చేసేవారిని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీస్ శాఖ కఠిన నిఘా ఏర్పాటు చేసిందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని గుర్తించి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి వారి వల్ల అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున, పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేసే ప్రక్రియను చేపడతామని తెలిపారు. వయస్సు నిండని మైనర్ లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, వేదికలపై డీజేల పేరుతో భారీ శబ్ద కాలుష్యం కలిగించడం పై చర్యలు ఉంటాయని, ఎక్కడైనా ఎవరైనా ఇబ్బందులకు గురైతే తక్షణమే ‘డయల్ 112’ కు సమాచారం అందించాలని కోరారు.
