సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్యుల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ, అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. గత సోమవారం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీకోసం) కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.. ఈ వారం జిల్లా నలుమూలల నుండి మొత్తం 23 అర్జీలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు సైబర్ మోసాలు, అధిక వడ్డీల వేధింపులు మరియు ప్రేమ పేరుతో మోసం వంటి అంశాలపై బాధితులు ఎస్పీ గారికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కరించాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.
