సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్చే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్’ (ISP) ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. భీమవరంలో నేడు,గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆర్సెలార్ మిత్తల్ & నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ భారీ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం ₹1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది. అని పేర్కొన్నారు. తొలి దశలో ₹80,000 కోట్ల భారీ పెట్టుబడితో పనులు ప్రారంభమవుతాయని, 2029 నాటికి మొదటి దశ పూర్తి చేసి, ఏటా 8.2 మిలియన్ టన్నుల (MTPA) ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వివరించారు. మొదటి దశలోనే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
