సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ ప్రాంతంలో ఇంకా నివురుగప్పిన నిప్పుల ఉన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియడంతో హోటల్స్ తదితర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను నేడు, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.993 అదనంగా పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.3,315కు చేరింది. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.3,071కి చేరుకుంది. ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర గతంలో రూ. 2,078.50 ఉండేది. అదేవిధంగా, ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,031 నుంచి రూ. 3,024కు పెరిగింది. ఇక 5 కిలోల సిలిండర్ ధర రూ.914.50కి పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను మూడుసార్లు పెంచింది కేంద్రం. మొదట మార్చిలో రూ.144 పెరగగా, ఏప్రిల్ 1న దాదాపు రూ.200 మేర పెరిగింది. అయితే ఇండ్లలో గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
