సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో ప్రజలను సుదీర్ఘ కాలంగా భయబ్రాంతులకు గురి చేస్తున్న పెద్దపులి ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లోని ప్రతిష్టాకమైన పోలవరం ప్రాజెక్ట్ పరిసరాలలో ఉందని తెలుస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్ రెడ్డి .అటవీ సంరక్షణాధికారి నీలకంఠనాధ రెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దిగువన మొన్న శనివారం రాత్రి పెద్దపులి దూడపై దాడి చేసి చంపిన ప్రాంతాన్ని, పులి సంచరించిన ప్రాంతాల్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అతిథి గృహం వద్ద ట్యాబ్ ద్వారా పులి కదలికల్ని పరిశీలించారు. పులి శింగన్నపల్లి, కొత్తూరు పరిసర ప్రాంతాల రిజర్వు ఫారెస్టులో సంచరిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం విశాఖ జూ నుంచి పులిని తీసుకొచ్చి రంపచోడవరం అడవుల్లో వదలడం జరిగిందని, అయితే ఊహించని రీతిలో పులి గోదావరి నదిని దాటి పశువుల్ని తినడానికి అలవాటు పడిందని, గడిచిన కాలంలో మనుషులపై ఎలాంటి దాడిచెయ్యలేదన్నారు. పులి కదలికల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న అటవీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.. పులిని పట్టుకోవడానికి శ్రీశైలం అటవీశాఖ నుంచి ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగిందన్నారు.
