సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం రేపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్ నిర్వహించినున్నట్టు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు విజయవాడలోని కార్యాలయంలో తెలిపారు. అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నామని రేపు బుధవారం ఉదయం 9 గంటల నుంచి లారీలను ఎక్కడికక్కడే నిలుపుదల చేయాలని లారీ యజమానులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది తెలుగు ప్రజల బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించటం బాధాకరమని పేర్కొన్నారు. రైతులు ఇచ్చిన 22 వేల ఎకరాల్లో నిర్మించిన ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోడానికి రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులందరూ లారీలను ఆపివేయాలని పిలుపునిచ్చారు.
