సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల, పాఠశాల హైస్కుల్లోని 18 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రాచీనకాలం నుంచి సమాజానికి గురువులే ఆదర్శ మూర్తులని, విద్యార్థి భవిష్యత్ కు గురువులే పునాది రాళ్ళు అని అన్నారు. గురువులు విద్యా బోధనలతో తమ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతారనే నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపుతారని, గురువులు చేసిన త్యాగానికి, సేవలను సమాజం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. ఉపాధ్యాయులు తమ విద్యా బోధనతో సమాజంలో మార్పు తెచ్చి సమసమాజ స్థాపనకు కంకణ బద్ధులు కావాలని తెలిపారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, పలువురు అధ్యాపకులు , కూటమి నేతలు పాల్గొన్నారు.
