సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో నేడు, బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తో కలసి పార్లమెంట్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి, ఆగస్టు 1న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ఆహ్వానించారు. .ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ఏపీలో ఆక్వా రైతులు, రొయ్యల దాణా తయారీదారులు, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా, పొగాకు రంగాల అభివృద్ధికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ తో కలిసి పోలవరం, సాగునీరు, ప్రాజెక్టులపై చర్చించారు.
